వరద బాధితుల పరామర్శకు మంత్రి మేకపాటి.. ఇప్పుడు తీరిందా? అంటూ బాధితుల నిలదీత

  • సంగం మండలం కోలగట్లలో బాధితులను పరామర్శించిన మంత్రి
  • మంత్రిని చూడగానే బాధతో నిలదీత
  • అండగా ఉంటామని మంత్రి హామీ
వరద బాధితుల పరామర్శకు వెళ్లిన మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి బాధితుల నుంచి నిరసన ఎదురైంది. ఇటీవల భారీ వర్షాల కారణంగా నెల్లూరు అతలాకుతలమైంది. జనం తిండీతిప్పలు లేకుండా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఈ నేపథ్యంలో తాజాగా బాధితులను పరామర్శించేందుకు మంత్రి మేకపాటి జిల్లాలోని సంగం మండలం కోలగట్లకు వెళ్లారు. మంత్రిని చూడగానే బాధితుల్లో కోపం ఒక్కసారిగా కట్టలు తెంచుకుంది. ఇప్పుడు తీరిందా? అంటూ నిలదీశారు.

బతకుతామో, లేదో తెలీని స్థితిలో బిక్కుబిక్కుమంటూ గడిపామని, తీరిగ్గా ఇప్పుడా వచ్చేది? అని నిలదీశారు. వరద ముంచెత్తడంతో నడుములోతు నీళ్లలో తీవ్ర ఇబ్బందులు పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తిండిలేక నానా పాట్లు పడ్డామన్నారు. అయితే, వారిని అనునయించిన మంత్రి మేకపాటి ప్రభుత్వం తరపున వీలైనంత సాయం చేస్తామని వారికి హామీ ఇచ్చారు. అండగా ఉంటామని హామీ ఇవ్వడంతో బాధితులు శాంతించారు.

Nellore District
Mekapati Goutham Reddy
Flood
Andhra Pradesh

More Telugu News